అమ్మఒడి నగదు వచ్చింది.. మీ బ్యాంకు వివరాలు చెప్పమని చెప్పి ఓ గృహిణి బ్యాంకు ఖాతానుంచి ఆన్లైనులో నగదు దోచుకుపోయిన ఘటనపై రాజమహేంద్రవరం మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.సీఐ ఎస్.పి.వీరయ్యగౌడ్ తెలిపిన వివరాల మేరకు.. కంబాలచెరువు వద్ద ఉన్న ఆదమ్మదిబ్బ ప్రాంతానికి చెందిన కె.హరిప్రసాద్ నగరంలో ప్రైవేటు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఈయన భార్య రత్నకుమారికి ఈ నెల 18న ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్చేసి అమరావతి క్యాంపు కార్యాలయం అమ్మఒడి విభాగం నుంచి కాల్ చేస్తున్నట్లు చెప్పాడు. మీ కుమారుడికి అమ్మఒడి వచ్చింది..బ్యాంకు వివరాలు తెలియజేస్తే నగదు ఖాతాకు జమవుతుందని తెలిపాడు. ఆ మాటలు నమ్మిన ఆమె వివరాలు తెలియజేసింది. అనంతరం వచ్చిన ఓటీపీ సైతం చెప్పింది. నిమిషాల వ్యవధిలో ఖాతా నుంచి రూ.42 వేలు తీసుకున్నట్లుగా సెల్ఫోనుకు సూక్ష్మసందేశం వచ్చింది. ఓటీపీ చెప్పగానే నగదు డెబిట్ కావడం, కొంత సమయానికి సదరు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్చేసి మళ్లీ ఓటీపీ వస్తుంది అదికూడా చెప్పాలని సూచించడంతో వెంటనే అప్రమత్తమైన ఆమె ఫోన్ కట్ చేసింది. అనంతరం భర్త సహకారంతో బ్యాంకు సిబ్బందిని సంప్రదించగా ఖాతాలో ఉన్న రూ.5.24 లక్షలు భద్రంగా ఉన్నాయని, ఆన్లైనులో చెప్పిన ఓటీపీతో రూ.42 వేలు మాత్రమే చోరీకి గురైనట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. జరిగిన ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.