దశాబ్దాలుగా తమ ఆధీనంలో ఉన్న లంక భూముల్లో మట్టిని కొల్లగొడుతున్నారని, ఈ అరాచకాన్ని ప్రశ్నిస్తే పోలీసులు బెదిరిస్తున్నారని చిడిపి దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోసేనురాజు కొవ్వూరు వచ్చిన నేపథ్యంలో వారంతా ఆయనను కలిశారు. వినతిపత్రం అందించి సమస్యను వివరించారు. కొయ్య దుర్గాప్రసాద్, అక్కాబత్తుల చిన్నబ్బులు, కవల శ్రీను మాట్లాడుతూ గోదావరిలోని లంక భూముల్లో తమకు పట్టాలిచ్చారన్నారు. ఈ మధ్య కాలంలో మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని, ఈనెల 13న మట్టి తీసుకెళుతున్న లారీలను ఆపగా తాళ్లపూడి పోలీసులు వచ్చారన్నారు. తహసీల్దారు అనుమతి ఇచ్చారని చెప్పగా ఆ పత్రాలను చూపించమని కోరామన్నారు. ఇపుడు కొవ్వూరు పోలీసులు వచ్చి తమను స్టేషనుకు రమ్మంటున్నారన్నారు. ఎందుకు లారీలను ఆపారంటూ బెదిరిస్తున్నారన్నారు. గోదావరి మధ్యలో తూరలు అమర్చి రోడ్డును వేశారని, యథేచ్ఛగా మట్టి తరలించి ఇటుక బట్టీలు, ఇతర అవసరాలకు వాడుతున్నారన్నారు.
ఈ మేరకు మోసేనురాజు డీఎస్పీ వర్మతో చరవాణిలో మాట్లాడారు. లంక భూముల్లో మట్టిని తవ్వుకునిపోతే దళితులు వ్యవసాయం ఎలా చేసుకుంటారని అడిగారు. అక్రమంగా తరలిస్తున్న మట్టి లారీలను ఆపితే పోలీసులు దౌర్జన్యం చేయడం ఏమిటన్నారు. ఆ లారీలు ఆపితే పోలీసులకు సంబంధం ఏమిటని, సమస్యను పరిష్కరించాలన్నారు. అవసరమైతే ఈ విషయాన్ని కలెక్టరు దృష్టికి తీసుకెళ్తామన్నారు.