కొవ్వూరు, తూర్పు గోదావరి జిల్లా: గోదావరి నదిపై ఉన్న రోడ్డు కం రైలు వంతెనకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఎంతో ప్రాధాన్యం ఉంది.వంతెన రహదారి అధ్వానంగా మారడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. గోతులమయంగా మారి నెలలు గడుస్తున్నా.. పట్టించుకున్న నాథుడే కరవయ్యారని వాహనదారులు వాపోతున్నారు. రోడ్డు కం రైలు వంతెనపై నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. జాయింట్ల వద్ద బీటలు పెద్దవి కావడంతో వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయి. రాజమహేంద్రవరం వైపు ఐరన్ ప్లేటు కదిలిపోతుండడం ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తుంది. పాఠశాలల బస్సుల కుదుపులతో చిన్నారులకు సైతం ఇబ్బందులు తప్పట్లేదు. రాజమహేంద్రవరం నుంచి కొవ్వూరు, కొవ్వూరు నుంచి రాజమహేంద్రవరం ఆటోలు కూడా తిరగని పరిస్థితి నెలకొందంటే తీవ్రత అర్థమవుతోంది. అధికారులు తాత్కాలిక చర్యలైనా చేపట్టాలని పలువురు ప్రయాణికులు కోరుతున్నారు.