Chandrababu:
దిగువ కోర్టు నుంచి ‘సుప్రీం’ వరకు విచారణలు, తీర్పులు
అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబునాయుడికి సంబంధించిన కేసుల్లో సోమవారం కీలకం కానుంది..
దిగువ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు చంద్రబాబు దాఖలు చేసిన పలు పిటిషన్లపై విచారణలు, తీర్పులు ఆరోజు వెలువడనున్నాయి. నైపుణ్యాభివృద్ధి సంస్థకు సంబంధించి సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని సుప్రీంకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్పై సోమవారం(ఈనెల 9న) విచారణ ఉంది. ఇదే కేసులో తనకు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు వేసిన పిటిషన్పై విజయవాడలోని ఏసీబీ కోర్టు సోమవారమే నిర్ణయాన్ని వెల్లడించనుంది. దీంతోపాటు మరోసారి ‘పోలీసు కస్టడీ’కి కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్పై సైతం అదేరోజు ఏసీబీ కోర్టు తగిన ఉత్తర్వులు జారీచేయనుంది. ఈ రెండు పిటిషన్లపై శుక్రవారం ఏసీబీ కోర్టులో వాదనలు ముగిసిన విషయం తెలిసిందే..
హైకోర్టులోనూ చంద్రబాబుకు సంబంధించిన మూడు బెయిలు పిటిషన్లపై సోమవారం తీర్పులు వెల్లడికానున్నాయి. రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు, ఫైబర్ నెట్ కేసుల్లో బెయిలు కోసం చంద్రబాబు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై ఇటీవల వాదనలు ముగియడంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.సురేశ్రెడ్డి తీర్పులను రిజర్వు చేసిన సంగతి తెలిసిందే. ఈ మూడు పిటిషన్లలో న్యాయమూర్తి సోమవారం నిర్ణయం వెల్లడించనున్నారు..