గురు న్యూస్ విశాఖపట్నం :180 కోట్ల రూపాయలతో విశాఖలోని రామానాయుడు స్టూడియో సమీపంలో ఐదు ఎకరాలలో కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో యూనిటీమాల్ ని నిర్మించేందుకు రంగం సిద్ధం చేశామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలియజేశారు. రాంనగర్ విఎమ్ఆర్డిఏ కాంప్లెక్స్ లో కొత్తగా ఏర్పాటు చేసిన ఆప్కో, లేపాక్షి షోరూమ్ ను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనిటీమాల్ నిర్మాణానికి కావలసిన భూసేకరణ పూర్తయిందని, ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా సిద్ధంగా ఉందని చెప్పారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళ నైపుణ్యాలను ఈ యూనిటీ మాల్ లో ఏర్పాటు చేయనున్నామని, సరసమైన ధరలకు ప్రజలు వాటిని విక్రయించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. అదే విధంగా యూనిటీ మాల్కు సమీపంలోనే ఒక కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించనున్నామని మంత్రి అమర్నాథ్ అన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ,నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్ రూపొందించిన ఈ హైబ్రిడ్ మోడల్ లేపాక్షి, ఆప్కో షోరూమ్ 94 వద్దని ఆయన తెలిపారు . ముఖ్యంగా చేనేత, హస్తకళల కార్మికులను ప్రోత్సహించేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి షో రూమ్ లు ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. రాష్ట్రంలో చేనేత కార్మికులకు గడిచిన నాలుగున్నర సంవత్సరాలలో సుమారు 1000 కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని ఆయన అన్నారు . అలాగే రెండు లక్షల మంది చేతి వృత్తుల పని వారికి ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం విస్తృతమైన చర్యలు తీసుకుందని వివరించారు. ఉప్పాడ, మంగళగిరి, కాళహస్తి తదితర ప్రాంతాలకు చెందిన వస్త్రాల విక్రయానికి ప్రభుత్వం నిరంతరం చేయూతని అందిస్తోందని అలాగే ఏటికొప్పాక, కొండపల్లి, లేపాక్షి కళా వస్తువుల విక్రయానికి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మంత్రి అమర్నాథ్ చెప్పారు.