గురు న్యూస్ విశాఖపట్నం :ఆqనకాపల్లి సమీపంలో ఉన్న బొజ్జన కొండకు త్వరలోనే అంతర్జాతీయ ఖ్యాతి లభించనుందని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. అనకాపల్లి ఎంపీ బీసెట్టి సత్యవతి తీసుకువచ్చిన సుమారు 7.30 కోట్ల రూపాయల కేంద్ర నిధులతో బొజ్జనకొండ అభివృద్ధిలో భాగంగా ఆ ప్రదేశంలో ధ్యాన మందిరానికి వైసిపి ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వై.వీ.సుబ్బారెడ్డి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ బీసెట్టి సత్యవతి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సుబ్బారెడ్డి మాట్లాడుతూ బొజ్జనకొండ అభివృద్ధికి శ్రీకారం చుట్టడం అనకాపల్లి చరిత్రలో శుభదినము అని అన్నారు. జిల్లాల విభజన నేపథ్యంలో అనకాపల్లిని జిల్లాగా చేసి దీని అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రాముఖ్యత కలిగిన బొజ్జనకొండ మరింత ఆధ్యాత్మిక శోభనం సంతరించుకుంటే అనకాపల్లి ప్రాముఖ్యత కూడా పెరుగుతుందని ఆయన అన్నారు. ఇప్పటివరకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి బౌద్ధ భిక్షువులు ఈ బొజ్జనకొండ ప్రాంతాన్ని సందర్శించడానికి వస్తున్నారని, త్వరలోనే విదేశాలకు చెందిన బౌద్ధ బిక్షువులు కూడా ఈ ప్రాంతానికి వస్తే బొజ్జనకొండకు అంతర్జాతీయ ఖ్యాతి లభిస్తుందని సుబ్బారెడ్డి అభిప్రాయపడ్డారు.మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ బొజ్జనకొండ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వo ఏడున్నర కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, ఇందులో రెండున్నర కోట్ల రూపాయలతో బొజ్జనకొండ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలియజేశారు. హైవే నుంచి బొజ్జనకొండకు వచ్చే మార్గంలో శిలా తోరణం ఏర్పాటు చేస్తామని, అలాగే రెస్టారెంట్, పార్కింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదేవిధంగా సౌండ్ అండ్ లైటింగ్ సిస్టం ద్వారా బొజ్జనకొండ ప్రాముఖ్యతను పర్యాటకులకు తెలియజేస్తామని అమర్నాథ్ వివరించారు. నాలుగు నుంచి తొమ్మిది శతాబ్దాలు మధ్య అంటే సుమారు 1500 నుంచి 2000 సంవత్సరాల కిందట జరిగిన బొజ్జనకొండ నిర్మాణాలు 1906లో బయటపడ్డాయని ఆయన తెలియజేశారు. ఈ కొండకు ఉన్న విశిష్టత దేశంలోని మరే బౌద్ధ ఆరామానికి లేదని ఆయన చెప్పారు. బొజ్జనకొండ అభివృద్ధికి అవసరమైన ప్రభుత్వ స్థలాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యాటకశాఖకు అప్పగించారని దీనివలన బొజ్జనకొండ అభివృద్ధికి మార్గం సుగమయిందని మంత్రి అమర్నాథ్ చెప్పారు. త్వరలో రానున్న ఎన్నికలకు ముందే కొండ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా సుందరయ్యపేటలోని కేంద్రీయ విద్యాలయ సిబ్బంది క్వార్టర్స్ కు, మిగిలిన పనుల కోసం పది ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి తెలియజేశారు. అలాగే అనకాపల్లిలో మూడు కోట్ల రూపాయలతో టీటీడీ కల్యాణ మండపాన్ని కూడా నిర్మించనున్నామని అమర్నాథ్ చెప్పారు. అనకాపల్లి ఎంపీ బీశెట్టి సత్యవతి మాట్లాడుతూ బుద్ధుడు భగవత్ స్వరూపుడని బొజ్జనకొండ అభివృద్ధితో అనకాపల్లి ఖ్యాతి మరింత పెరుగుతుందని అన్నారు.