in ,

తొలగించిన ఆదివాసీల జాబ్ కార్డులను పునరుద్ధరించండి

 అనకాపల్లి జిల్లా, గొలుగొండ మండలం, పాత మల్లంపేట పంచాయితీ, N. గదబపాలెం గ్రామంలో అఖిల భారత గ్రామీణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో   జరిగిన సభలో  జాతీయ ప్రధాన కార్యదర్శి పి.ఎస్. అజయ్ కుమార్  ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,పాత మల్లంపేట గ్రామ పంచాయతీ పరిధిలో 833 ఉపాధి హామీ పథకం జాబ్ కార్డ్లు ఉండగా, 484 జాబ్ కార్డులు డిలీట్ అయినాయని, అందులో అత్యధిక శాతం ఆదివాసి కుటుంబాలకు చెందిన జాబు కార్డులు ఉన్నాయని ఆయన అన్నారు. తొలగించబడిన కార్డుల వివరాలను పరిశీలిస్తే, “ఉపాధి పనిలోకి రావడానికి ఆసక్తి చూపించలేదు” ( not willing to work) అని నమోదు చేశారని ఇది చట్ట విరుద్దమని ఆయన అన్నారు.అనకాపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత 7 మండలాలలో జీవిస్తున్న ఆదివాసీల భూములను కబ్జా చేయడానికి జిల్లాలో భూ మాఫియా రెవిన్యూ అధికారుల సహాయంతో అనేక కుట్రలు పన్నుతున్నదని ఆయన అన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాల చట్టాని(ROR)కి విరుద్ధంగా మండల రెవెన్యూ కార్యాలయం సిబ్బంది భూ మాఫియా తో చేతులు కలిపి క్షణాలలో రికార్డులు మార్చేస్తున్నారని, రికార్డులు తమ పేరును మార్చుకున్న తర్వాత భూ మాఫియా ఆదివాసీలపై దాడులకు దిగుతుందని అజయ్ కుమార్ అన్నారు..అలాగే పాతమల్లంపేట శివారు గ్రామాలైన N. గదబపాలెం, M. గదబపాలెం గ్రామాల ఆదిమ తెగల  ఆదివాసీలందరికీ  చట్టం ప్రకారం అంత్యోదయ అన్న యోజన కార్డులు (AAY ) ఇవ్వాలని, నిమ్మగెడ్డ గ్రామంలో సీలింగ్ మిగిలిన భూములు సాగు చేస్తున్న ఆదివాసీలకు డిఫారం పట్టాలు ఇవ్వాలని అజయ్ కుమార్ డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో అఖిల భారతి వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం గొలుగొండ మండలం శాఖ నాయకులు గోరా సూరిబాబు, దుంప ప్రసాద్, కవల చెంచయ్య మరియు పాత మల్లంపేట పంచాయతీ ఆదివాసీలు పాల్గొన్నారు.

Written by N.Chiranjeevi

దళిత వాడలను ప్రత్యేక పంచాయితీలు చేయాలి

నవయుగ వైతాళికుడు గుర్రం జాషువా