గురు న్యూస్ విశాఖపట్నం : విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని సెంట్రల్ పార్క్ వద్ద ఉన్న గుడివాడ గురునాథరావు విగ్రహానికి ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి అయిన బూడి ముత్యాల నాయుడు ముందుగా పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత గురునాథరావు తనయుడు, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బూడి ముత్యాల మాట్లాడుతూ గురునాథరావు తన హయాంలో అనేకమంది ఔత్సాహిక కార్యకర్తలను నాయకులుగా తయారు చేశారని అన్నారు. ఆయన శిష్యరికంలోనే తాను కూడా రాజకీయంగా ఎదిగి ఇంతటి వాడినయ్యానని చెప్పారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడ గురునాథరావు అభివృద్ధి కనిపిస్తుందని అయన అన్నారు. ముఖ్యంగా పేదవాళ్లకు విరివిగా ఇళ్లు మంజూరు చేసి, వారి గుండెల్లో గురునాథరావు నిలిచిపోయారని ముత్యాలరావు కొనియాడారు. పార్టీ కార్యకర్తలకు ఆయన ఎప్పుడూ అండగా నిలబడేవారిని, తన రాజకీయ చతురతతో మహా మహా నాయకులను మెప్పించి ఈ ప్రాంత అభివృద్ధికి నిధులు రాబట్టగలిగే వారిని ఆయన అన్నారు. గురునాథరావు ఆశయాలను ఎప్పటికీ కొనసాగిస్తామని, ఆయన ఆలోచనలను సజీవంగా ఉంచే కార్యక్రమాలు చేపడతామని ఉప ముఖ్యమంత్రి ముత్యాల నాయుడు చెప్పారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ తన తండ్రి గుర్నాథరావు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా ఈ ప్రాంతానికి ఎనలేని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. శివారు ప్రాంతాలైన ఆరిలోవ, హనుమంతవాక తదితర ప్రాంతాలు ఎంతగానో అభివృద్ధి చెందడానికి గురునాథరావు వేసిన పునాది కారణమని అన్నారు. గురునాథరావు తీసుకున్న ముందు చూపు నిర్ణయాలు అనేక ప్రాంతాల అభివృద్ధికి దోహదపడ్డాయని అమర్నాథ్ చెప్పారు. తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ఆయన చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించే అవకాశం తనకు దక్కిందని, ఆయన ఆశయాలకు, ఆలోచనలకు తగ్గట్టుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తానని తెలియజేశారు. తన తండ్రి అనుచరులు,సహచరులే తన ఆస్తి అని అమర్నాథ్ చెప్పారు . తండ్రి ఆశయాలకు తగ్గట్టుగానే తను నడుచుకుంటానని. అమర్నాథ్ చెప్పారు. ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బూడి ముత్యాల నాయుడు కేక్ కట్ చేసి మంత్రి అమర్నాథ్ కి తినిపించారు.ఈ కార్యక్రమంలో నగర మేయర్ హరి వెంకట కుమారి, పార్లమెంటు సభ్యులు ఎంవి వి సత్యనారాయణ, శాసలి మండలి సభ్యురాలు వరుదు కళ్యాణి, శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్ కుమార్, పార్టీ అధ్యక్షులు కోలా గురువులు, సమన్వయకర్తలు కేకే రాజు, ఆడారి ఆనంద్ కుమార్, డిప్యూటీ మేయర్ జీఎన్ శ్రీధర్, ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హనోకు, రాష్ట్ర అదనపు కార్యదర్శి రవి రెడ్డి,కార్పొరేషన్ చైర్మన్లు దిలీప్ కుమార్,పేర్ల విజయ్ చందర్, ఫరూక్, జడ్పీటీసీ అనురాధ తదితరులు పాల్గొన్నరు.