రాజమహేంద్రవరం: తెదేపా అధినేత చంద్రబాబు అరెస్ట్ కుట్రపూరితమనే విషయం అందరికీ తెలుసని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. న్యాయస్థానంలో కచ్చితంగా తమకు న్యాయం జరుగుతుందని చెప్పారు..
నారా భువనేశ్వరి, బ్రాహ్మణితో కలిసి రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబుతో ఆయన ములాఖత్ అయ్యారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు మనో ధైర్యం కోల్పోలేదు
”జైలులో చంద్రబాబు మనోధైర్యం కోల్పోలేదు. దేశ వ్యవసాయ రంగానికి ఎంతో సేవ చేసిన ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ మృతికి సంతాపం తెలియజేయమని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ, మద్దతు తెలిపిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. వైకాపా ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని తెదేపా శ్రేణులను కోరారు. తెదేపాకు వస్తున్న ప్రజాదరణను అణచివేయాలని అధికార పార్టీ చూస్తోంది. కానీ దాని వల్ల మా పార్టీకి ఆదరణ పెరుగుతుంది తప్ప తగ్గదు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ వర్గమూ ఆనందంగా లేదు.
రాజకీయ కక్షతోనే చంద్రబాబు అరెస్ట్ అనే విషయం అందరికీ తెలుసు.
కావాలనే బురద చల్లుతున్నారు
నా సొంత భూమి కూడా ఇన్నర్ రింగ్రోడ్డులో పోయింది. 2001లో ఈడుపుగల్లులో కొన్న 40 సెంట్ల సొంత స్థలం అది. దాని విలువ రూ.7 కోట్లు. సొంత భూమినే పొగొట్టుకున్న నేను.. అవినీతి చేస్తానా?కావాలనే బురద చల్లుతున్నారు. మాపై చేసే ఆరోపణల్లో నిజమేంటో కోర్టుల్లో తేలుతుంది. తెదేపా, జనసేన పార్టీ కమిటీలు ఇచ్చే నివేదిక ప్రకారం ఉమ్మడి కార్యాచరణ రూపొందించి ముందుకు సాగుతాం” అని నారాయణ చెప్పారు.