డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గంలో నాదెండ్ల మనోహర్ పర్యటన
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజక వర్గం అల్లపల్లివారి పాలెం గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు బండారు వెంకటరాజు ఇటీవల జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. బుధవారం వెంకటరాజు కుటుంబాన్ని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. మృతికి గల కారణాలు, కుటుంబ స్థితిగతులను ఆరా తీశారు. మృతుని భార్య శ్రీమతి శ్రీలక్ష్మి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ పంపిన రూ. 5 లక్షల బీమా చెక్కును ఆమెకు అందచేశారు. పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
• రావులపాలెంలో ఘన స్వాగతం
అంతకు ముందు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన నాదెండ్ల మనోహర్ కి కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు ఘన స్వాగతం పలికారు. మనోహర్ నీ పూలమాలలతో ముంచెత్తారు. అక్కడి నుంచి కొత్తపేట వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మనోహర్ కి స్వాగతం పలికిన వారిలో పార్టీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, పీఏసీ సభ్యులు పితాని బాలకృష్ణ, కొత్తపేట ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్, మండపేట ఇంఛార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ తదితరులు ఉన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రెండు రోజుల పాటు శ్రీ మనోహర్ పర్యటిస్తారు. ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబాలను పరామర్శించి, రూ. 5 లక్షల బీమా చెక్కులు అందచేస్తారు. పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం అవుతారు.